ఓటుకి నోటు కేసుతో తెలంగాణాలో చావుదెబ్బతిన్న తెదేపాపై తాజాగా మరో చావుదెబ్బ పడినట్లే కనిపిస్తోంది. గ్యాంగ్ స్టార్ నయీంతో తెలంగాణాకి చెందిన ఒక మాజీ తెదేపా మంత్రికి సంబంధాలున్నాయని, ఆయనే నయీంని పెంచి పోషించారని, నయీం ఇంట్లో స్వాదీనం చేసుకొన్న డైరీలో సదరు తెదేపా నేత ఫోన్ నెంబర్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయన మాజీ మంత్రి స్వర్గీయ మాధవరెడ్డి అని ప్రచారం జరుగుతోంది.
వాటిపై ఆయన భార్య ఉమా మాదవరెడ్డి స్పందిస్తూ, “నయీం ఎన్కౌంటర్ జరిగిన తరువాత పోలీసులు చెప్పిన సమాచారం అంటూ నిత్యం మీడియావాళ్ళు నాకు ఫోన్ చేసి దీని గురించి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. తెలంగాణా ప్రభుత్వమే రాజకీయ దురుదేశ్యంతో మా కుటుంబంపై ఈ విధంగా మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ నా భర్తకి కానీ నాకు గానీ నయీంతో సంబంధం ఉన్నట్లు రుజువు చేయగలిగితే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్దంగా ఉన్నాను. మావారి మరణంతో ఇప్పటికే మా కుటుంబం చాలా సఫర్ అయ్యింది. ఇంకా మమ్మల్ని ఎందుకు వేదిస్తున్నారో అర్ధం కావడం లేదు.”
“నాకు, నాభర్తకి గానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు..వడ్డీ వ్యాపారాలు లేవు. అలాగే మావారు పోయిన తరువాత పార్టీ కోరితే రాజకీయాలలోకి వచ్చాను తప్ప నా అంతటనేను ఇష్టపూర్వకంగా రాలేదు. కనుక నేను ఎన్నికలలో గెలవడం కోసం నాతో పోటీ పడుతున్న ప్రత్యర్దులని చంపించాలని ప్రయత్నించాననే వార్తలు కూడా అబద్దం. నేరపూరితమైన రాజకీయాలు చేసే అలవాటు మా కుటుంబంలో ఎవరికీ లేదు. అయినా చనిపోయిన వ్యక్తిపై, నాపై ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదు. నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. అదేమీ రహస్యమైన విషయమేమీ కాదు. ఒకవేళ నయీంకి నాకు మద్య ఫోన్ కాల్స్ జరిగినట్లు అనుమానం ఉంటే ఆ కాల్స్ డాటా సేకరించి చూపండి. అందులో నా పేరుంటే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్న ప్రచారమనే భావిస్తున్నాను,” అని అన్నారు.
నయీంతో ఉమా మాధవ్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు అనధికారికంగా ఎవరో మీడియాకి లీక్ చేస్తున్న వార్తలే తప్ప వాటిని ఇంతవరకు పోలీసులు నిర్దారించలేదు. ఒకవేళ నిర్ధారించి ఉంటే అప్పుడు వారి సంబంధాల గురించి చర్చించవచ్చు. కానీ ఈలోగా జరుగుతున్న ఈ ప్రచారం వలన తెలంగాణాలో తెదేపాకి మళ్ళీ కోలుకోలేని విధంగా మరో చావు దెబ్బ తగలడం తధ్యం.
